కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు (Ramchander Rao) మండిపడ్డారు. కోహెడలో ఏర్పాటు చేస్తున్న పండ్ల మార్కెట్ కోసం బలవంతంగా భూ సేకరణ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతులకు పరిహారం చెల్లించుకుండా 239 ఎకరాల రైతుల భూముల్లో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. సోమవారం ఆయన నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఆందోళన చేస్తే అరెస్టులు చేస్తారా?
భూ సేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తుంటే వాళ్లను అరెస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికే అక్కడ మార్కెట్ ఉన్నా పక్కనే ఉన్న రైతుల భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని ఆరోపించారు. రైతులను పోలీసులతో అరెస్ట్ చేయించి నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతుల వడ్లు కొనరు కానీ.. వాళ్ల భూములు మాత్రం బలవంతంగా గుంజుకుంటారా? అంటూ ఫైర్ అయ్యారు. రైతులకు పూర్తిగా నష్టపరిహారం చెల్లించిన తర్వాతే అక్కడ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేయాలని కోరారు.

