కలం, కరీంనగర్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే సందర్భంగా పెద్దపల్లి ఎంపీ (Peddapalli MP) గడ్డం వంశీకృష్ణ ఛాలెంజ్ విసిరారు. 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని కనీసం 50 మంది యువతకు ఉపాధి కల్పించాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడారు. “కేటీఆర్ అంకుల్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు పదేళ్లపాటు మంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. ఈ 50వ జన్మదినం సందర్భంగా కనీసం 50 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి. మీకు బర్త్డే ఛాలెంజ్ విసురుతున్నాను. అదే మీ జన్మదినానికి సమాజానికి అందించే ఉత్తమ బహుమతి అవుతుంది” అని అన్నారు.
అలాగే గతంలో గ్లోబరీనా సంస్థ, పేపర్ లీకేజీల అంశాల నేపథ్యంలో అనేక మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని పేర్కొన్నారు. కేటీఆర్ ఆ బాధిత విద్యార్థులు, వారి కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.

