కలం, వెబ్డెస్క్: దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) భవితవ్యంపై ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు వేణుస్వామి (Venu Swamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజేపీ కుండలి తన దగ్గర ఉందని, ఈ పార్టీకి విపరీతమైన అటెన్షన్, క్రేజ్ రావడానికి జాతక బలమే కారణమని చెప్పారు. కాక్రోచ్ పార్టీ భవితవ్యం ఈ సంవత్సరం అక్టోబర్ 31 వరకు ఒక తీరు, తర్వాత మరో తీరు అన్నట్లుగా సాగుతుందని చెప్పారు.
కాక్రోచ్ పార్టీకి రాజయోగం ఉందని, వీళ్లను అణచివేయాలని చూస్తే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందని వేణుస్వామి అన్నారు. కాక్రోచ్ పార్టీ మద్దతుదారులను పద్ధతిగా సైలెంట్ హ్యాండిల్ చేసేందుకు ప్రయత్నించాలని సూచించారు. జాతక రీత్యా సీజేపీ డిమాండ్ ప్రకారం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం ఉందన్నారు. నూటికి నూరు శాతం ఏదో ఒక కారణంతో ధర్మేంద్ర రాజీనామా చేస్తారని చెప్పారు. అలాగే రానున్న రోజుల్లో సీజేపీకి చెందిన ముగ్గురు ముఖ్య నేతలు జైలుకు వెళ్లే ఛాన్స్ ఉందన్నారు.
కాక్రోచ్ పార్టీ హిందూ ధర్మానికి, శాస్త్రాలకు వ్యతిరేకంగా వెళ్లే అవకాశం ఉందని వేణుస్వామి తెలిపారు. ఈ పార్టీ వల్ల బీజేపీకి చాలా డ్యామేజ్ జరుగుతుందన్నారు. నరేంద్ర మోదీ, బీజేపీ జాతకంపై ఈ పార్టీ ప్రభావం తీవ్రంగా ఉండనుందన్నారు. రాబోయే కాలంలో ఎవ్వరూ ఊహించని స్థితికి సీజేపీ చేరుతుందన్నారు. దేశంలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతుంది, ఏ పార్టీ అధికారం కోల్పోతుందనేది నూటికి అరవై శాతం కాక్రోచ్ పార్టీ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.

