కలం, సూర్యాపేట : సూర్యాపేటలోని (Suryapet) సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో తూర్పు తెలంగాణ ప్రాంతీయ స్థానిక సంస్థల సదస్సు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య (Siricilla Rajaiah) ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థలు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుని ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. అనవసర వ్యయాన్ని తగ్గించి, స్వీయ ఆదాయాన్ని పెంచినప్పుడే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించగలమని తెలిపారు.
‘గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం’ అనే భావనతో గ్రామీణ ప్రాంత అభివృద్ధికి స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు పలికారు. పల్లె, పట్టణ ప్రాంతాలలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్య కార్యదర్శి కాత్యాయనీ దేవి, సభ్యురాలు సుజానా యాదవ్, సభ్యుడు ఎస్. సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ స్థానిక సంస్థల పనితీరుపై వివరాలు అందించారు.
ఆర్థిక సంఘం చైర్మన్ మాట్లాడుతూ.. ఆర్థిక అసమానతలు తగ్గించి సమాజ అభివృద్ధికి అన్ని వర్గాల శక్తిని వినియోగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆర్థిక సంఘం ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ అభివృద్ధి సూచనలు ప్రభుత్వానికి అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నగర మేయర్లు, ఛైర్పర్సన్లు, ఎక్స్ ఎం.పి.టి.సిలు, ఎక్స్ జడ్.పి.టి.సిలు, సర్పంచులు, మునిసిపల్ కమీషనర్లు, డిపిఓలు, ఎంపిడిఓలు, ఎన్జిఓస్, సూర్యాపేట అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, నల్గొండ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సూర్యాపేట జెడ్పీ సీ.ఈ.ఓ డి. శిరీష, నల్గొండ జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీపీఓ యాదగిరి, డిఎంహెచ్ఓ వెంకటరమణ డీఎల్పీఓలు, ఎంపీఓలు, ఎంఈఓలు గ్రామపంచాయతి కార్యదర్శులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: తెలంగాణ రియల్ ఎస్టేట్పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
Follow Us On: Instagram

