కలం, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ హైకోర్టుకు (Madhya Pradesh High Court) చెందిన ఇండోర్ బెంచ్ చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ధార్ జిల్లాలోని వివాదాస్పద భోజ్శాల (Bhojshala)-కమల్ మౌలా మసీదు ప్రాంగణం వాగ్దేవి (సరస్వతీ దేవి) ఆలయమేనని కోర్టు ప్రకటించింది. ఈ ప్రాంగణంలో ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి అనుమతినిస్తూ 2003లో భారత పురావస్తు శాఖ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సమర్పించిన శాస్త్రీయ సర్వే నివేదిక, చారిత్రక ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఈ కట్టడం పరమార వంశానికి చెందిన రాజా భోజ్ నిర్మించిన సంస్కృత పాఠశాల, వాగ్దేవి ఆలయమని స్పష్టం చేసింది. అలాగే అక్కడ హిందువులకు పూర్తిస్థాయి హక్కులను కల్పించింది.
ఈ తీర్పు నేపథ్యంలో ధార్ జిల్లావ్యాప్తంగా అధికారులు భారీ భద్రతను ఏర్పాటుచేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 1,200 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజీవ్ రంజన్ మీనా హెచ్చరించారు. తీర్పు వెలువడిన సమయం శుక్రవారం కావడంతో మసీదు పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.
Read Also: గ్రేటర్లోకి 3 వేల ఈవీ బస్సులు తీసుకొస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Sharechat

