కలం, వెబ్ డెస్క్ : రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ (Sircilla Collectorate) కార్యాలయంలో మంగళవారం తీవ్ర కలకలం రేగింది. నిత్యం వందలాది మందితో బిజీగా ఉండే ఈ ప్రాంగణంలో ఒక అధికారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గంటన్నర పాటు గడిపారు. విధుల్లో చేరడానికి వెళ్తున్న డీఆర్డీఏ ఏపీడీ నర్సింగ్ సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా లిఫ్టులో చిక్కుకుపోయారు. లిఫ్ట్ మధ్యలోనే నిలిచిపోవడం, లోపల గాలి ఆడకపోవడంతో ఆయన ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న సమయాల్లో ఆయన చాకచక్యంగా వ్యవహరించారు. వెంటనే తన మొబైల్ ఫోన్ ద్వారా తోటి సిబ్బందికి సమాచారం అందించి అప్రమత్తం చేశారు.
సమాచారం అందుకున్న వెంటనే కలెక్టరేట్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. సాంకేతిక నిపుణులను రంగంలోకి దించారు. నిపుణులు సుమారు గంటన్నర పాటు తీవ్రంగా శ్రమించి, లిఫ్ట్ తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు సాంకేతిక లోపాన్ని సరిచేసి ఆయన్ను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కలెక్టరేట్ లాంటి కీలక ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి ఘటన జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

