కలం, మెదక్ బ్యూరో : సింగూరు ప్రాజెక్టు (Singur Project)లో నీరు డెడ్ స్టోరేజీకి చేరింది. వాటర్ సప్లైకి డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. రాబోయే రోజుల్లో రాజధాని హైదరాబాద్ తో పాటు ప్రాజెక్ట్ సమీప జిల్లాలకు తాగునీటి సరఫరాలో ముప్పు పొంచి ఉందనే ఆందోళన మొదలైంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరులోని ప్రాజెక్టును మంజీరా నదిపైన నిర్మించారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు మరమ్మతులు చేస్తుండడంతో నీటి పంపింగ్ కష్టంగా మారింది. దీంతో జలమండలి అధికారులు తాగునీటి సరఫరాలో అంతరాయం రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు.
మరమ్మతుల కోసం ప్రాజెక్టు ఖాళీ
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు . ప్రస్తుతం 5 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. హైదరాబాద్ సిటీ తాగునీటి అవసరాలకు ప్రతిరోజూ ప్రాజెక్ట్ ద్వారా 70 ఎంజీడీలు (మిలియన్ గ్యాలన్ ఫర్ డే) పంపింగ్ చేస్తుంటారు. ప్రాజెక్టు కేవలం హైదరాబాద్కే కాకుండా, ఉమ్మడి మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా నీటి అవసరాలను కూడా తీరుస్తుంది. నిజానికి సింగూరు రిజర్వాయర్ లో నీటి నిల్వలు 15 టీఎంపీలకుపైగా ఉండగా.. గతేడాది డ్యామ్ సేఫ్టీ అధికారులు ప్రాజెక్టును తనిఖీలు చేశారు.
ప్రాజెక్టు రివిట్ మెంట్ దెబ్బతిన్నదని, భద్రత పరంగా ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినది. ప్రాజెక్టు మరమ్మతులపై నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చేపట్టాలని డ్యామ్ సేఫ్టీ అధికారు లు స్పష్టంచేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.16 కోట్లతో ప్రాజెక్ట్ రివిట్ మెంట్ పనులను మొదలుపెట్టింది. పనులు కొనసాగడానికి వీలుగా, ప్రాజెక్టులోని నీటి గతేదాడి డిసెంబర్ లోనే దశలవారీగా కిందికి వదిలి రిజర్వాయర్ ను ఖాళీ చేశారు. మరమ్మత్తు పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, పనులు నత్తనడకన సాగుతుండటంతో వర్షాకాలం వచ్చినా ఇంకా పూర్తి కాలేదు.
ఇన్ టెక్ వెల్ కిందకు పడిపోయిన నీటిమట్టం
ప్రాజెక్టులో తాగునీటి అవసరాల కోసమే నిల్వ ఉంచి, మిగతా నీటికి కిందికి వదిలారు. ప్రసుత్తం ప్రాజెక్టులో నీటి నిల్వలు క్రమంగా పడిపోతుండడంతో డెడ్ స్టోరేజీకి చేరుకుంది. దీంతో సాధారణ పద్ధతిలో ఇన్ టెక్ వెల్ గ్రావిటీ ద్వారా వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లకు నీరు అందడం లేదు. ఇన్టెక్ వెల్స్ నిర్దిష్ట ఎత్తులో ఉండగా నీటి మట్టం ఆ కనీస స్థాయి కంటే కిందకు పడిపోయింది.
నీరు ఇన్ టెక్ వెల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. సాధారణంగా నీటి మట్టం ఎక్కువగా ఉన్నప్పుడు, గ్రావిటీ ఆధారంగా ఎలాంటి మోటార్లు అవసరం లేకుండానే ప్రవాహం ద్వారా ఇన్టెక్ వెల్స్ నుంచి వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లకు చేరుతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సహజ ప్రవాహం ఆగిపోయింది. నీటిలో మట్టి, పూడిక ఎక్కువగా ఉంది. దీంతో పైపుల్లో అడ్డంకులు ఏర్పడటమే కాకుండా, మిగిలిన కొద్దిపాటి నీరు కూడా ఇన్టెక్ వైపు కదలడం లేదు.
ఎమర్జెన్సీ పంపింగ్ కు ట్రయల్ రన్
ప్రసుత్త పరిస్థితి తీవ్రతతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. నీటి సరఫరా ఇబ్బందులు లేని మార్గాలను గుర్తించారు. ఇన్టెక్ వెల్కు నీరు అందకపోవడంతో ప్రాజెక్టులోని డెడ్ స్టోరేజ్ నీటిని పైపుల ద్వారా ఎత్తిపోసేందుకు వీలుగా 17 భారీ మోటార్లను అమర్చారు. డెడ్ స్టోరేజ్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి పంపింగ్ కు ట్రయల్ రన్ నిర్వహించారు.
ఇందులో భాగంగా డెడ్ స్టోరేజీ నుంచి భారీ మోటర్లతో విజయంవంతంగా ఇన్ టెక్ వెల్ కు నీటి ఎత్తిపోశాయి. మోటర్లపై లోడ్ పడి ఇబ్బందులు తలెత్తినా కానీ అదనపు మోటార్లను అందుబాటులో ఉంచారు. వీటి ద్వారా ఎత్తిపోసే నీటిని ముందుగా సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్లోని వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్కు తరలిస్తారు. అక్కడ నీటిని శుద్ధి చేసిన తర్వాత హైదరాబాద్ సిటీకి సరఫరా చేస్తారు.
10 రోజుల్లో పంపింగ్ షురూ.. రెండు నెలలు సరఫరా
– ఇప్పటికిప్పుడే మోటార్ల ద్వారా పంపింగ్ మొదలు పెట్టకపోయినా, మరో వారం లేదా 10 రోజుల్లో పంపింగ్ ప్రారంభించనున్న జలమండలి.
– ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా రాబోయే నెలన్నర, రెండు నెలల పాటు హైదరాబాద్ వాసులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసిన అధికారులు.
– హైదరాబాద్లోని శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సనత్ నగర్, పటాన్ చెరువు నియోజకవర్గాలకు సింగూరే ప్రధాన తాగునీటి వనరుగా ఉంది. ప్రసుత్తం ప్రాజెక్ట్ లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరినా కానీ.. ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నీటి సరఫరాకు ప్రిపేరైన జలమండలి.

