కలం, వెబ్ డెస్క్: సింగర్ మంగ్లీ (Singer Mangli) కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆమె ఇప్పటికే సీపీ సజ్జనార్ను కలువగా, తాజాగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసత్య ప్రచారాల నేపథ్యంలో డీజీపీని (DGP) కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డీజీపీ ఆదేశించినట్లు తెలుస్తోంది.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మైక్రో ఫైనాన్స్ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన మీద అసత్య ఆరోపణలు చేస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మైక్రో ఫైనాన్స్ విషయంలో బాధితులకు అన్యాయం జరిగితే.. వారికి అండగా ఉంటానని మంగ్లీ స్పష్టం చేశారు. ఈ కేసులోకి తన కుటుంబ సభ్యులను లాగొద్దని మీడియాకు ఆమె రిక్వెస్ట్ చేశారు. తనకు పాటల ప్రపంచం తప్ప, ఎలాంటి విషయాలు తెలియవన్నారు.
మరోవైపు న్యాయవాది సుబ్బారావు బార్ అసోసియేషన్ను ఆశ్రయించాడు. మంగ్లీపై (Singer Mangli) ఫిర్యాదు చేయడానికి వెళ్తే..పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారని ఆరోపించాడు. తనపై పోలీసులు వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెందినట్లు బార్ అసొసియేషన్ ముందు ఆయన ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.

