కలం, ఖమ్మం బ్యూరో: సత్తుపల్లిలోని జేవీఆర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కోటి టన్నులకుపైగా బొగ్గు రవాణా జరుపుతోంది. ప్రస్తుతం ప్లాంట్లో సాంకేతిక సమస్యలు నెలకొనడంతో సింగరేణి సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతి (Buddha Prakash Jyothi) కీలక మీటింగ్ నిర్వహించారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాంట్లో సాంకేతిక సమస్యలను అధిగమించి పూర్తి స్థాయిలో బొగ్గు రవాణా జరిగేలా చూడాలని ఆదేశించారు. అలాగే ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి ఏడాదికి 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు. బొగ్గు రవాణాలో తలెత్తిన అవరోధాలను వెంటనే అధిగమించాలని సూచించారు.
సత్తుపల్లి ఏరియా నుంచి ప్రతిరోజు సుమారు 50 వేల టన్నుల బొగ్గు రవాణా చేయాల్సి ఉంటుందన్నారు. కోల్ బంకర్లలో ఏర్పడిన సాంకేతిక సమస్యలను పరిష్కరించుకొని బొగ్గు రవాణాకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ఆయన తెలిపారు. జేవీఆర్-2 ఓపెన్ కాస్ట్ గని నుండి ఈ ఆర్థిక సంవత్సరం 11 మిలియన్ టన్నుల బొగ్గును, కిష్టారం ఓపెన్ కాస్ట్ గని నుండి 24 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
అలాగే ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాకుకు ఈ ఏడాది 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించామని వెల్లడించారు. బొగ్గు ఉత్పత్తితోపాటు బొగ్గు రవాణా కూడా సమర్థంగా జరపాలన్నారు. కోల్ కారిడార్ రోడ్డు నిర్మాణం పూర్తవడానికి కొంత సమయం పడుతుందని, రైల్వే సైడింగులకు రోడ్డు మార్గం ద్వారా బొగ్గును రవాణా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు ఎల్.వి సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, ఎం. తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. వెంకన్న, జనరల్ మేనేజర్ టి. శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Also: ఏప్రిల్ 27 తర్వాతే పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక.. ఎందుకంటే?
Follow Us On : WhatsApp

