కలం, వెబ్ డెస్క్: ఆసియా నంబర్వన్, ప్రపంచ ఆరో ర్యాంకర్ జోరవర్ సింగ్ సంధూ(Zoravar Singh Sandhu) కు ఆసియా గేమ్స్ ముందు ఊహించని షాక్ తగిలింది. భారత షూటింగ్ సమాఖ్య ప్రకటించిన ప్రతిపాదిత షాట్గన్ జట్టులో ఆయనకు చోటు దక్కలేదు. అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ, దేశీయ సెలక్షన్ ట్రయల్స్లో వచ్చిన తక్కువ స్కోర్లు ఆయన అవకాశాలను దెబ్బతీశాయి. 47 ఏళ్ల జోరవర్ గత ఏడాది ఏథెన్స్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం గెలిచి భారత ట్రాప్ షూటింగ్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే వరల్డ్ కప్ ఫైనల్స్లో కూడా మెడల్ రౌండ్కు చేరి ఏడో స్థానంలో నిలిచారు. తాజాగా అల్మాటీలో జరిగిన వరల్డ్కప్లో ‘జీరో షూటర్’గా పాల్గొన్న ఆయన.. భారత షూటర్లలో అత్యధికంగా 119 స్కోర్ నమోదు చేశారు.
అయితే జాతీయ ఛాంపియన్షిప్స్, దేశీయ ట్రయల్స్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో ఆసియా గేమ్స్ జట్టులో ఆయన పేరు లేకుండా పోయింది. ఇటీవలే వరల్డ్ నంబర్ 4 ర్యాంక్లో ఉన్న జోరవర్ను తప్పించడం ఇప్పుడు షూటింగ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని జోరవర్ ఎన్ఆర్ఏఐను కోరారు. గత ఆరు నెలల్లో భారత ట్రాప్ షూటర్లలో తానే అత్యుత్తమ అంతర్జాతీయ స్కోర్లు నమోదు చేశానని ఆయన గుర్తు చేశారు.
అయితే షూటింగ్ సమాఖ్య మాత్రం ఏడాది క్రితమే ప్రకటించిన ఎంపిక నిబంధనల ప్రకారమే జట్టును ఎంపిక చేసినట్లు స్పష్టం చేసింది. ఆసియా గేమ్స్కు వెళ్లే పురుషుల ట్రాప్ జట్టులో కైనన్ చెనై, అహ్వర్ రిజ్వీ, శపత్ భరద్వాజ్కు చోటు దక్కింది. జోరవర్ లాంటి అనుభవజ్ఞుడిని తప్పించడం భారత పతకావకాశాలపై ప్రభావం చూపుతుందా అనే చర్చ కూడా మొదలైంది.

