కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర గవర్నర్గా శివప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కొత్త గవర్నర్ చేత లోక్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగు భాష రాకపోయినా ఆయన తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. గవర్నర్ కార్యదర్శి దానకిషోర్ ఆధ్వర్యంలో తెలుగులో ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తైంది. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులంతా గవర్నర్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, శాసనమండలి చైర్మన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, హైకోర్టు జడ్జీలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ బుర్రా వెంకటేశం తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సాధారణంగా జాతీయ గీతంతో ప్రారంభమై దానితోనే ముగిసే కార్యక్రమంలో ఈసారి వందేమాతరం గీతంతో ప్రారంభమైంది. ముగింపు కార్యక్రమంలో సైతం తొలుత వందేమాతరం, ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇంతకాలం గవర్నర్గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో శివప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) బాధ్యతలు చేపట్టారు. పలువురు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. హాజరైనవారిలో కొద్దిమందిని స్వయంగా పలకరించిన గవర్నర్ వారికి తేనీటి విందుతో ఆతిధ్యం ఇచ్చారు.

