కలం, తెలంగాణ బ్యూరో : సీబీఐ (CBI) డైరెక్టర్ ప్రవీణ్ సూద్ (Praveen Sood) హైదరాబాద్ చేరుకున్నారు. సీబీఐ బ్రాంచ్ కార్యాలయంలో రాష్ట్రానికి చెందిన ఆఫీసర్లతో రివ్యూ చేస్తున్నారు. కీలకమైన కేసుల పురోగతిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. అనేక కీలక కేసులు హైదరాబాద్తో ముడిపడి ఉన్నందున వాటి ప్రస్తుత స్టేటస్ను తెలుసుకుని తదుపరి కార్యాచరణపై డైరెక్షన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం తదుపరి దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి గతేడాది సెప్టెంబరులోనే లేఖ రాశారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయడంపై ఆరు నెలలుగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఆ కేసు విచారణను కొలిక్కి తేవడంపైనే లోకల్ ఆఫీసర్లతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఆకస్మికంగా ఆయన హైదరాబాద్లో పర్యటించి సమీక్షిస్తుండడం కీలకంగా మారింది.
పలు కేసులు సీబీఐ విచారణలో పెండింగ్ :
కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కేసు దర్యాప్తు మాత్రమే కాక వామనరావు దంపతుల హత్య కేసు (Vaman Rao Couple Murder Case) కూడా సీబీఐ పరిధిలోనే ఉన్నది. ఈ హత్య కేసుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై ఇటీవలే విచారణ జరిగింది. వీలైనంత తొందరగా దర్యాప్తును కంప్లీట్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి తోడు ఇటీవల రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న సైబర్ కేసులపై కూడా డైరెక్టర్ ప్రవీణ్ సూద్ (Praveen Sood) ఆరా తీసినట్లు తెలిసింది. సీబీఐ అధికారుల పేరుతో డిజిటల్ అరెస్టుల రూపంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నందున దాన్ని కట్టడి చేయడంతో పాటు నెట్వర్క్ ను ఛేదించడంపై సూచనలు, గైడెన్స్ ఇస్తున్నట్లు తెలిసింది. హైకోర్టు ఇటీవల పలు కేసులను ప్రస్తావిస్తూ ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసుల గురించి సీబీఐకి కొన్ని ఇచ్చిన డైరెక్షన్స్ గురించి కూడా అధికారులకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లు తెలిసింది. వీటన్నింటికి తోడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు పురోగతిపైనా కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం.
Read Also: కల్తీ మాల్.. ప్రాణాలకి డేంజర్ బెల్స్
Follow Us On : WhatsApp

