కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ జిల్లా (Nalgonda District) అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. అధిక వడ్డీ ఆశజూపి ఇటీవల కాలంలో ఒక్క నల్లగొండ జిల్లాలోనే రూ.600 కోట్లకు పైగా ఫ్రాడ్ జరిగింది. గిరిజన ప్రాంతాలను టార్గెట్గా చేసుకుని అధిక వడ్డీ పేరుతో రూ.కోట్లలో వసూలు చేస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి. రూ.లక్షకు 10 నుంచి 15 శాతం వడ్డీ చెల్లిస్తామనే ఆశచూపడంతో అక్రమార్కుల పని ఈజీగా అయిపోతుంది. అయితే ఇలాంటి వ్యవహారాలు వెలుగులోకి రావడం.. అధికారులు సైతం అరెస్టు చేసి చేతులు దులుపుకోవడం.. మళ్లీ కొత్తగా మరో అక్రమార్కుడు పుట్టుకు రావడం జిల్లాకు మాములైపోయింది.
గతంలో బాలాజీ నాయక్ రూ.400 కోట్లు..?
పెద్ద అడిశర్లపల్లి (Pedda Adiserla Pally) మండలం పలుగుతండాకు చెందిన బాలాజీ నాయక్ అనే వ్యక్తి ఏకంగా ఏజెంట్లను పెట్టుకుని పెద్ద దందాకు తెరలేపాడు. మొదట రూ.లక్షకు 10 నుంచి 15 శాతం వడ్డీ ఇస్తామంటూ ప్రజల్ని నమ్మబలికించి.. మూడు నాలుగు నెలల పాటు సక్రమంగా వడ్డీ చెల్లిస్తాడు. ఆ ఆశతో పెద్దసంఖ్యలో జనం ఆసక్తి చూపిస్తారు. ఈజీ మనీకి అలవాటుపడి చాలా మంది ఈ ట్రాప్లో చిక్కుకున్నారు. దీంతో బాలాజీనాయక్ దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూలు చేశాడు. అందుకోసం ఏకంగా సాఫ్ట్వేర్ కంపెనీనే స్థాపించాడు. ఈ వ్యవహారం అన్ని మలుపులు తీసుకుని తీరా అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ బాధితులకు నేటి వరకు న్యాయం జరగలేదు. అధికారులు ఆ దిశగా చొరవ చూపకపోవడం గమనార్హం.
తాజాగా భీమా నాయక్.. రూ.200 కోట్లు..?
తాజాగా డిండి (Dindi) మండలంలోని తబలా తండాకు చెందిన భీమా నాయక్ సైతం ఇదే తరహాలో దందాకు తెరలేపాడు. లక్షకు 15 శాతం వరకు వడ్డీ వస్తుందని నమ్మించడంతో పెద్దవూర మండలంలోని ఫాల్తీ తండాలో దాదాపు 55 మంది రూ.7 కోట్ల వరకు ముట్టజెప్పారు. వీరితో పాటు సాగర్, హాలియా, పెద్దవూర, డిండి, మిర్యాలగూడ ప్రాంతాల్లో ఇదే తరహా అధిక వడ్డీ ఆశజూపి దాదాపు రూ.200 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ఈ వ్యవహారం వెలుగు చూడడంతో పోలీసులు షరా మాములుగానే నిందితుడు భీమానాయక్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే భీమానాయక్ బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఓ తహసీల్దార్ ఉండడం చర్చనీయాంశంగా మారింది.

