కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ పల్నాడు (Palnadu) జిల్లాలో వినాయక స్వామి విగ్రహం (Lord Vinayaka Idol) ధ్వంసం కావడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ఈ ఘటన నకరికల్లు మండలం రూపెనగుంట్ల (Rupenaguntla) గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో ఉన్న పురాతన వినాయక స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసినట్లు స్థానికులు తెలిపారు. విగ్రహాన్ని పగులగొట్టి పక్కనే ఉన్న పంట పొలాల్లో పడేసినట్లు సమాచారం. ఉదయం ఈ విషయం గమనించిన గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేయడానికి వచ్చిన కొందరు దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దుండగుల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

