కలం, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తన సొంత నిర్ణయంతోనే భారత్ లో ఉంటున్నారని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (Jaishankar) అన్నారు. హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్ నుంచి వస్తున్న విజ్ఞప్తులు, ఒత్తిడుల గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది బంగ్లాదేశ్ లో చోటుచేసుకున్న పరిణామాల అనంతరం హసీనా భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటున్నారు.
మరోవైపు బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వం.. హసీనాపై అనేక కేసులు నమోదు చేసింది. బంగ్లాలో వందల మందిని బలి తీసుకున్న అల్లర్ల వెనక హసీనా హస్తముందంటూ విచారణ జరిపింది. ఇటీవల ఆమెకు మరణశిక్ష సైతం విధించింది. ఈ క్రమంలోనే హసీనాను తమకు అప్పగించాలంటూ భారత్ ను కోరుతోంది. దీనిపై శనివారం విలేకరులతో జై శంకర్ (Jaishankar) మాట్లాడుతూ.. భారత్ కు రావాలన్నది పూర్తిగా హసీనా సొంత నిర్ణయమన్నారు. బంగ్లాదేశ్ తిరిగి వెళ్లాలా లేదా అనేది అక్కడి పరిస్థితులను బట్టి ఆమె నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. ప్రజాస్వామ్య, పొరుగు దేశంగా భారత్ ఎల్లప్పుడూ బంగ్లాదేశ్ శ్రేయస్సును కోరుకునే దేశమని జైశంకర్ స్పష్టం చేశారు.
Read Also: గెలుపు కోసం తాంత్రిక పూజలు.. ‘స్థానిక‘ పోరులో చిత్ర విచిత్రాలు
Follow Us On: Facebook


