కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రాన్నే కాక దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల ఆరు హత్యల కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు బండ్ల రాజ్కుమార్ (35) ఆత్మహత్య చేసుకున్నాడు. గత శుక్రవారం అర్ధరాత్రి తన (Shabad Raj Kumar)పై పోక్సో కేసు పెట్టిన కారణంగా మైనర్ బాలికని, తల్లిని, నానమ్మని చంపిన నిందితుడు.. ఇంటికొచ్చి భార్య, ఇద్దరు పిల్లలను కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 8 బృందాలుగా విడిపోయి నాలుగు రోజులుగా ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో రాజ్ కుమార్ మరణించినట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. మేనమామ ఊరైన కొత్తూరు మండలం, పంజర్ల గ్రామంలో రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ లభ్యమైంది. ఘటనకి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అసలేం జరిగిందంటే..
షాబాద్ మండలం దేవతల్ గుడా గ్రామానికి చెందిన రాజ్కుమార్పై మే నెలలో ఒక మైనర్ బాలికను వేధించినందుకు గానూ పోక్సో (POCSO) కేసు నమోదైంది. ఈ కేసులో ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చిన అతను, తనపై ఫిర్యాదు చేసిన సదరు బాలిక కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉన్మాదిలా మారిన రాజ్కుమార్, మొదట ఆ మైనర్ బాలిక ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న ఆమె తల్లి, నానమ్మలను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆ బాలికను కారులో అపహరించి సమీపంలోని చెరువు వద్ద గొంతుకోసి చంపేశాడు.
అక్కడితో ఆగని నిందితుడు.. నేరుగా తన ఇంటికి చేరుకుని తన భార్య సరిత (33), నిద్రిస్తున్న ఇద్దరు కొడుకులు పరీక్షిత్ (4), దైవీక్షిత్ (2)లను కూడా కిరాతకంగా నరికి చంపాడు. గంట వ్యవధిలోనే రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురిని పొట్టనబెట్టుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లు, జూదానికి బానిసైన రాజ్కుమార్ భారీగా అప్పులు చేసి మానసిక ఒత్తిడిలో ఉన్నాడని, భార్య విడాకులు ఇస్తానని నిలదీయడంతో పాటు పోక్సో కేసు పెట్టిన కక్షతోనే ఈ నరమేధానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
పోలీసుల గాలింపు- చివరకు ఆత్మహత్య..
ఒకే రాత్రి ఆరుగురిని హతమార్చిన అనంతరం రాజ్కుమార్ (Shabad Raj Kumar) తన తండ్రికి ఫోన్ చేసి, తాను చేసిన ఘోరాన్ని ఒప్పుకుంటూ ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి మొబైల్ స్విచ్ఛాఫ్ చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లతో రంగంలోకి దిగారు. నిందితుడిని పట్టుకునేందుకు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆధ్వర్యంలో 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తీవ్రంగా గాలించారు. రాజ్కుమార్ సమాచారం అందించిన వారికి రూ.2 లక్షల బహుమతి కూడా ప్రకటించారు. అతను ప్రయాణించిన కారు పెట్రోల్ అయిపోవడంతో నందిగామ రైల్వే ట్రాక్ వద్ద వదిలేసి వెళ్లినట్లు గుర్తించారు. చివరకు కొత్తూరు ప్రాంతంలో రాజ్కుమార్ మృతదేహం లభ్యం కావడంతో ఈ సంచలన కేసులో నిందితుడి చావుతో కథ ముగిసింది. దీనికి సంబందించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: కాక రేపుతోన్న వరంగల్ రాజకీయాలు.. హాట్ టాపిక్గా మంత్రి ‘చిన్నపులి’ కామెంట్స్!
Follow Us On: X(Twitter)

