కలం, కరీంనగర్ బ్యూరో: నీట్ విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన విద్యాసంస్థల బంద్ కరీంనగర్లో (Karimnagar) ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు అప్రమత్తమై.. మంకమ్మతోటలోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలోకి ప్రవేశించి నాయకులను అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోదీకి బినామీగా పనిచేస్తుందా.. అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయించడం ప్రజాస్వామ్య హక్కులపై దాడేనని విమర్శించారు.
మంత్రి పదవికి రాజీనామా చేయాలి..
ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) వెంటనే విద్యా శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని గజ్జెల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. నిరసన తెలిపే హక్కును భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిందని, కేంద్ర ప్రభుత్వం తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. వెంటనే నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని, ఢిల్లీ పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.
ఈ నిరసనల్లో కార్యదర్శి మచ్చ రమేష్, ఏఐఎస్బీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిక రాజశేఖర్, ఏఐఆఫ్డీఎస్ కార్యదర్శి శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి అరవింద్, ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి హేమంత్, నాయకులు సన్నీ, సందీప్, రాకేష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: బండి సంజయ్ కార్యాలయం ముట్టడికి యత్నం
Follow Us On : WhatsApp

