కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ఇంధనం లభించడం లేదు. రాష్ట్రంతో పాటు హైదరాబాద్ లోనూ ఇదే పరిస్థితి ఉంది. పెట్రోల్ లేకపోవడంతో చాలా బంకుల్లో నోస్టాక్ బోర్డులు (No Stock Boards) దర్శనమిస్తున్నాయి. అలాగే బంకుల్లో ఇంధనం లేకపోవడంతో క్లోజ్ అవుతున్నాయి. పెట్రోల్ కొరత (Petrol Crisis) తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బంకులు ఎక్కడ ఓపెన్ ఉన్నాయో తెలుసుకుని బైకర్స్, వాహనాల యజమానులు పోటెత్తుతున్నారు. దీంతో బంకుల వద్ద భారీ క్యూలైన్లు ఏర్పడడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
మరోవైపు నగరంలో పెట్రోల్ కొరత (Petrol Crisis) లేదు అని సీపీ సజ్జనార్ ప్రకటించినప్పటికీ.. పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. పుకార్లను నమ్మొద్దని ఆయన సూచించినా జనాలు పట్టించుకోవడం లేదు. వాస్తవానికి అధికారుల ప్రకటనలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేని పరిస్థితులు హైదరాబాద్ లో కనిపిస్తున్నాయి. అయితే, ఆయిల్ కంపెనీలకు డీలర్లకు మధ్య నెలకొన్న బకాయిల కారణంగా పెట్రోల్ నిల్వ లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో పెట్రోల్ బంకుల నిర్వాహకులపై సివిల్ సప్లై అధికారులు సీరియస్ అవుతున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించి ఇంధనాన్ని తెప్పించుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

