కలం, వెబ్ డెస్క్: సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి (Srilakshmi) ఎట్టకేలకు పోస్టింగ్ ఇస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరున ఆమె ఉద్యోగ విరమణ చేయబోతుండగా.. జీఏడీలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది. ఆ స్థానంలో ఉన్న శంషేర్ సింగ్ రావత్ను బదిలీ చేసింది. శ్రీలక్ష్మికి రెండేళ్ల తరువాత పోస్టింగ్ దక్కడం గమనార్హం. వైసీపీ ప్రభుత్వంలో ఆమె అత్యంత కీలకమైన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సెక్రటరీగా వ్యవహరించారు. అనంతరం వచ్చిన కూటమి ప్రభుత్వం శ్రీలక్ష్మిని పూర్తిగా పక్కన పెట్టింది. పలుమార్లు ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగినా.. ఆమెను మాత్రం పట్టించుకోలేదు.
వివాదాల కారణంగానే..
1988 బ్యాచ్కు చెందిన శ్రీలక్ష్మి ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో ఒకరు. ప్రస్తుతం సీఎస్ హోదాలో ఉన్నారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ హయాంలో 2006–2009 మధ్య ఏపీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఈ క్రమంలో గాలి జనార్దన్ రెడ్డికి ఓబుళాపురం మైనింగ్ క్వారీలు కట్టబెట్టడంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సీబీఐ శ్రీలక్ష్మిని సైతం నిందితురాలిగా చేర్చింది. అక్కడి నుంచి ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి. కొంతకాలం జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే కొంత ఊరట దక్కింది. గతంలో ఆమె తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, కోర్ట్ కేసులు, వైఎస్ కుటుంబానికి సన్నిహితమనే కారణాలతోనే కూటమి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదని అప్పట్లో చర్చ జరిగింది.

