కలం, వెబ్ డెస్క్ : దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI Strike)లో రెండు రోజుల పాటు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ మే 25, 26 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, మెరుగైన పని వాతావరణం, సిబ్బందితో పాటు ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడటమే ఈ నిరసన ప్రధాన ఉద్దేశమని యూనియన్ ప్రతినిధులు వెల్లడించారు.
ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947 లోని సెక్షన్ 22 (1) నిబంధనల ప్రకారం ఈ సమ్మె నోటీసును యాజమాన్యానికి అందజేశారు. వర్క్మెన్ కేటగిరీకి చెందిన సిబ్బంది అందరూ ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఒకవేళ నిర్ణీత తేదీల్లో ఏదైనా కారణం వల్ల సెలవు ప్రకటించినా లేదా వీక్లీ ఆఫ్ ఉన్నా ఆ తర్వాతి రోజైన మే 27న సమ్మె కొనసాగుతుందని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఈ రెండు రోజుల పాటు నగదు లావాదేవీలు, ఇతర బ్యాంకింగ్ సేవలకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున ఖాతాదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

