కలం, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వ, టీడీపీ అధిష్టానంపై సత్యవేడు (Satyavedu) నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం (MLA Koneti Adimulam) కొడుకు సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తన తండ్రికి గౌరవం లేదని, ఇలాంటి పదవి ఉంటే ఎంత లేకుంటే ఎంత అని ప్రశ్నించారు. పార్టీ అధిష్టానం స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించకుండా నియోజకవర్గ ఇంచార్జ్ పదవి వేరొకరికి ఎలా ఇస్తారని నిలదీశారు. తన తండ్రి ఎంతో ఖర్చు చేసి ఎమ్మెల్యే అయ్యారని, ఆ డబ్బులు తిరిగి ఇస్తే పదవికి రాజీనామా చేస్తామని చెప్పారు. ఒక చిన్న తప్పు చేసినందుకు పార్టీలో కనీస గౌరవం కూడా దక్కడం లేదని, ఇలా ఎంతో మంది తప్పులు చేశారని వారికి ఏం శిక్ష విధించారని ప్రశ్నించారు. తన తండ్రి అనారోగ్యం కారణంగా కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.
సత్యవేడు నియోజకవర్గంలో స్థానిక సీఐ రోజూ ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాను దగ్గరుండి చేయిస్తున్నారని సుమన్ ఆరోపించారు. సత్యవేడులో అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు. తాము దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కాబట్టే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవం లేనప్పుడు పార్టీలో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. తన తండ్రిపై (MLA Adimulam) పార్టీలోని వారే కుట్రలు చేశారని సుమన్ ఆరోపించారు. సీఎం చంద్రబాబు, నారా లోకేశ్, టీడీపీ నాయకులు తమకు వెన్నుపోటు కాకుండా నేరుగా గుండెల్లో పొడిచి చంపాలన్నారు. ఇక ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులు తమవి కాదని, ఆ డబ్బును వారంలోపు తిరిగిస్తే కోనేటి ఆదిమూలం తన పదవికి రాజీనామా చేస్తారని వెల్లడించారు.
Read Also: ‘అధికారం కోసమే ఇదంతా’.. చంద్రబాబుపై మాణిక్యం ఠాగూర్ ఫైర్
Follow Us On : WhatsApp

