కలం, వెబ్ డెస్క్ : భారత స్టార్ షట్లర్లు సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి (Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి (Chirag Shetty) జోడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇండోనేషియా ఓపెన్ (Indonesia Open) బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల డబుల్స్ మొదటి రౌండ్ నుంచే ఈ ద్వయం అనూహ్యంగా తప్పుకుంది. బుధవారం మలేషియా జోడీ కాంగ్ ఖై క్సింగ్, ఆరోన్ తాయ్లతో జరిగిన మ్యాచ్లో సాత్విక్ భుజం గాయంతో ఇబ్బంది పడ్డారు. మొదటి గేమ్లో భారత జోడీ 6-11తో వెనుకబడి ఉన్న సమయంలో సాత్విక్ తన కుడి భుజం నొప్పిని చూపించడంతో మ్యాచ్ను మధ్యలోనే ఆపేసి ప్రత్యర్థులకు వాకోవర్ ఇచ్చారు.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్ నుంచి కూడా సాత్విక్ ఇదే భుజం నొప్పి కారణంగా తప్పుకున్నారు. గత వారమే ఈ జోడీ సింగపూర్ ఓపెన్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ఫజల్ అల్ఫియాన్, మహ్మద్ షోహిబుల్ ఫిక్రిలను 18-21, 21-17, 21-16తో ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీ గెలిచిన తొలి భారతీయ పురుషుల జోడీగా నిలిచిన సంతోషం లోపే ఈ గాయం తిరగబెట్టింది. సాత్విక్ భుజం గాయం కారణంగానే ఇండోనేషియా ఓపెన్ 2026 నుంచి తప్పుకుంటున్నట్లు భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ (BAI) ప్రకటించింది. రాబోయే ముఖ్యమైన టోర్నమెంట్ల కోసం వారు కోలుకోవడంపై దృష్టి పెడతారని బోర్డు తెలిపింది.
మరోవైపు మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్, రుత్విక గాద్దె జోడీ ప్రపంచ 20వ ర్యాంక్ తైపీ జంట యాంగ్ పో-హువాన్, హు లింగ్ ఫాంగ్లను ఓడించి తదుపరి రౌండ్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మ్యాచ్ల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ లక్ష్యసేన్ ఇండోనేషియాకు చెందిన అల్వి ఫర్హాన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. అయితే రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు థాయ్లాండ్కు చెందిన బుసానన్ ఒంగ్బామ్రుంగ్ఫాన్ను ఓడించి ముందడుగు వేశారు. పురుషుల డబుల్స్లో హరిహరన్ అంసకరుణన్, ఎమ్ఆర్ అర్జున్ జోడీ మలేషియాకు చెందిన రియో ఒలింపిక్ రజత పతక విజేత తాన్ వీ కియాంగ్, నూర్ మొహమ్మద్ అజ్రిన్ ఆయుబ్ జంటపై విజయం సాధించింది.

