కలం, వెబ్ డెస్క్: భారత స్టార్ బ్యాడ్మింటన్ జంట సాత్విక్సాయిరాజ్-చిరాగ్ శెట్టి సరికొత్త రికార్డు సృష్టించారు. అద్భుతమైన ఆటతో సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో ఈ భారత ద్వయం ప్రపంచ ఛాంపియన్లు, టాప్ సీడ్స్ అయిన కొరియా జోడి సియో సంగ్-జే, కిమ్ వోన్-హోలపై సంచలన విజయం సాధించారు. వరుసగా ఏడు టోర్నమెంట్లలో ఓటమి ఎరుగకుండా, 34 మ్యాచ్ల విజయ పరంపరతో కొరియా జంట కొనసాగుతోంది. అటువంటి జోడీని చిత్తు చేసి సాత్విక్-చిరాగ్ జోడి సరికొత్త చరిత్ర సృష్టించారు.
ఈ మ్యాచ్లో భారత జంట అద్భుతమైన ఫైట్బ్యాక్తో ఆకట్టుకుంది. మొదటి సెట్లో 8-13 పాయింట్లతో వెనుకబడినప్పటికీ, ఒకరికొకరు అండగా నిలుస్తూ ప్రణాళికాబద్ధంగా ఆడి స్కోరును 17-17 తో సమం చేశారు. ఆ తర్వాత సాత్విక్ పవర్ఫుల్ స్మాష్లు, చిరాగ్ మెరుపు వేగంతో స్పందిస్తూ 21-19 తో తొలి సెట్ను కైవసం చేసుకున్నారు. గతంలో ఈ కొరియా జోడి చేతిలో రెండుసార్లు ఓడిపోయిన అనుభవం ఉన్నప్పటికీ, ఈసారి మాత్రం సాత్విక్-చిరాగ్ ఏమాత్రం తడబడకుండా నెట్ వద్ద ఒత్తిడిని కొనసాగించారు.
రెండో సెట్లోనూ కొరియా ఆటగాళ్లు మొదట్లోనే 0-3 తో ఆధిక్యం సాధించినా, భారతీయులు తమ వ్యూహాన్ని మార్చి ప్రత్యర్థులను కోలుకోనివ్వలేదు. ఒక దశలో కొరియా జోడి 11-14 తో ముందంజలో ఉన్నా, సుదీర్ఘ ర్యాలీలలో సాత్విక్-చిరాగ్ ఎంతో ప్రశాంతంగా, నిలకడగా ఆడి పాయింట్లు సాధించారు. తీవ్ర ఒత్తిడికి గురైన కొరియా క్రీడాకారులు ఒకే షటిల్ కోసం ఇద్దరూ ఒకరినొకరు ఢీకొట్టడమే కాకుండా సర్వీస్ తప్పిదాలు కూడా చేశారు. దీనిని అనుకూలంగా మార్చుకున్న భారత జంట రెండో సెట్ను 21-18 తో గెలుచుకుని నేరుగా ఫైనల్కు చేరింది.
గత ఒలింపిక్స్ చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ తమ ఆటను ఎంతో మెరుగుపరుచుకున్న ఈ భారత జోడి, ఈ నెలలో వరుసగా రెండోసారి ఫైనల్ చేరడం విశేషం. ప్రపంచ స్థాయి ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ హోరాహోరీ పోరు క్రీడాభిమానులకు ఎంతో కనువిందు చేయగా, రేపు జరగబోయే టైటిల్ పోరుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

