కలం, సత్తుపల్లి: పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి (Sathupalli) పట్టణంలో చేపట్టిన భారీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఆషా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సుమారు 15 వేల మందితో నిర్వహించిన భారీ వనమహోత్సవ ర్యాలీ పట్టణంలో పర్యావరణ పరిరక్షణపై విశేష చైతన్యాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ స్థాయిలో పర్యావరణ ర్యాలీ జరగడం సత్తుపల్లిలో జరగడం విశేషం.
జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నేత డాక్టర్ మట్టా దయానంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జేవీఆర్ కాలేజ్ గ్రౌండ్లో వనమహోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. విద్యార్థులు, యువత, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో గ్రౌండ్ కిక్కిరిసిపోయింది.
మొదటి సారి చూస్తున్నా..
అక్కడి నుంచి పాత సెంటర్ మీదుగా సాగిన భారీ ర్యాలీలో వేలాది మంది పాల్గొని పర్యావరణ పరిరక్షణకు మద్దతు తెలిపారు. ర్యాలీలో జానపద కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే దంపతులు నడుస్తూ వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్న పర్యావరణ కార్యక్రమం తాను మొదటిసారి చూస్తున్నట్లు తెలిపారు.
సంరక్షణ మన బాధ్యతే..
ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం ముఖ్యమని పిలుపునిచ్చారు. డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ.. విద్య, అభివృద్ధి, సామాజిక చైతన్యంలో ముందంజలో ఉండే సత్తుపల్లి నియోజకవర్గం, ఈ ర్యాలీ ద్వారా రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

