Mobile Popup Ad
Mobile Popup Ad

చేనేత టెండర్లపై గంగుల కమలాకర్ ఫైర్

కలం, కరీంనగర్ బ్యూరో : చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి, నేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. కరీంనగర్ నగరంలోని కొత్తపల్లిలో నిర్వహించిన చేనేత పారిశ్రామిక సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నూతన పాలకవర్గ సభ్యులను సన్మానించారు.

ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి పనిచేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. సిరిసిల్ల నేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే పండుగల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పంపిణీ చేసే చీరల తయారీ బాధ్యతను కేసీఆర్ ప్రభుత్వం వారికి అప్పగించిందని గుర్తు చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పిస్తూ.. వస్త్రాల టెండర్లను (Handloom Tenders)  ఇతర రాష్ట్రాలకు అప్పగించడం వల్ల స్థానిక చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు.

రాబోయే రోజులలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేనేత కార్మికులకు గతంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను పునరుద్ధరించి మరింత అండగా నిలుస్తామని గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్ వాసాల రమేష్, చేనేత పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు మునిందర్, ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, కార్యదర్శి హనుమాండ్లు, మేనేజింగ్ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>