కలం, కరీంనగర్ బ్యూరో: ప్రజలకు సేవ చేయాలనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, అందుకే ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదించారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ (Sanjay Kumar) అన్నారు. ప్రభుత్వ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో విరుపాక్షి గార్డెన్స్లో జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. జగిత్యాల, రాయికల్ మున్సిపల్ వార్డు అధికారుల హాజరు శాతం తక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాల కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. మురుగు నీరు చెరువుల్లో కలవకుండా ఇంకుడు గుంతల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తడి-పొడి చెత్త వేరుగా సేకరించాలని, ప్లాస్టిక్ నివారణకు చర్యలు తీసుకోకుంటే డంపింగ్ యార్డులు కూడా సరిపోవని హెచ్చరించారు.
78 వేల కుటుంబాలకు పథకాలు..
“రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమ షెడ్యూల్ను గ్రామ పంచాయతీల్లో ప్రకటించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సూచించారు. డ్రగ్స్ నిరోధించడంలో ఈగల్ టీమ్ విజయవంతంగా పనిచేస్తోందన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో 78 వేల కుటుంబాలకు ఉచిత కరెంట్, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజా గౌడ్, ఆత్మ ఛైర్మెన్ కాటిపెల్లి గంగారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, జగిత్యాల మార్కెట్ కమిటీ ఛైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, జిల్లా, మండల అధికారులు, సర్పంచులు, కౌన్సిలర్లు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

