కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) జిల్లా బొల్లారం (Bollaram) మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కాలనీలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెంకట్ రెడ్డి నగర్ కాలనీలోని పెద్దమ్మ దేవాలయం సమీపంలో ఉన్న ఒక మూడు అంతస్తుల భవనంలో (G+3) తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. 16 పోర్షన్లు ఉన్న ఈ భవనంలోని కరెంటు ప్యానెల్ బోర్డు ద్వారా మంటలు మొదలై, గ్రౌండ్ ఫ్లోర్లో పార్క్ చేసిన నాలుగు బైకులకు వేగంగా వ్యాపించాయి.
మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో భవనంలో నివసిస్తున్న 16 కుటుంబాలకు చెందిన దాదాపు 60 మంది నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన బాధితులు ముందు, వెనుక ద్వారాల ద్వారా బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్ సిబ్బంది, హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో నాలుగు బైకులతో పాటు కొన్ని ఇళ్లలోని నిత్యావసర సరుకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: భారత్లో చైనా CCTV కెమెరాలపై నిషేధం.. ఎందుకంటే?
Follow Us On: Instagram

