కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో చోటుచేసుకున్న నిర్లక్ష్యం, సమన్వయ లోపం, పర్యవేక్షణ వైఫల్యాలపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జిల్లా సహకార అధికారి కిరణ్ కుమార్, హత్నూర ఎంపీడీవో బీ శంకర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ రాజశేఖర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
సమన్వయలోపం నిజమే..
హత్నూర మండలంలో ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు సంతృప్తికరంగా నిర్వహించడం లేదని గుర్తించామని, కొనుగోలు కేంద్రాల వద్ద పర్యవేక్షణ, మానిటరింగ్, సమన్వయంలో తీవ్ర లోపాలు ఉన్నట్లు వెల్లడైందన్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, మూడు రోజులలోగా తమ వివరణ సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

