కలం, సూర్యాపేట : కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో, నిబద్ధతతో పనిచేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో పదవులు తప్పకుండా వస్తాయని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పీసీసీ పరిశీలకులు మందుల సూర్య కిరణ్, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు స్పష్టం చేశారు. సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఎస్సీ సెల్ నిర్మాణ సమావేశం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. పార్టీ కోసం రాత్రింబగళ్లు కష్టపడే వారికి పారదర్శకంగా అవకాశాలు కల్పించేందుకే ప్రస్తుతం ఎస్సీ విభాగం నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పార్టీలో ఎన్నో ఏళ్లుగా నమ్ముకుని సేవలందిస్తున్న సీనియర్ నాయకులను గుర్తించి వారికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ విభాగంలో ఉన్న అన్ని ఉపకులాలకు కూడా పదవుల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఎస్సీ విభాగంతో పాటు యూత్ కాంగ్రెస్, ఐఎన్టీయూసీ, సేవాదళ్ తదితర అనుబంధ విభాగాల్లో కూడా పదవుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.
జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిలతో చర్చించి త్వరలోనే తగిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. గ్రామస్థాయి నుంచి పార్టీ కోసం కష్టపడే నిజమైన నాయకులకు, కార్యకర్తలకు పదవులు వచ్చేలా నేను ముందుండి పోరాడుతానని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల సహకారంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎకరం స్థలంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నట్లు నాయకులు ప్రకటించారు. ప్రతి అనుబంధ విభాగానికి (రైతు, మహిళా, యువజన, ఎస్సీ/ఎస్టీ/బీసీ సెల్స్) ప్రత్యేక గదులతో పాటు సమావేశాల నిర్వహణ కోసం ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ భవన నిర్మాణ బాధ్యతలను మందుల స్వామి తీసుకోగా.. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి స్వయంగా ఈ కార్యాలయానికి సంబంధించిన ప్రత్యేక డిజైన్ను రూపొందిస్తున్నారని వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్మీనారాయణ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు అమరారపు శ్రీనివాస్, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

