కలం, స్పోర్ట్స్ : ఒకవైపు 2026 ఫిఫా వరల్డ్ కప్లో(FIFA World Cup 2026) కేప్ వర్డే, కురకో వంటి చిన్న జట్లు సంచలనాలు సృష్టిస్తుంటే, భారత ఫుట్బాల్ జట్టు (Indian Football Team) మాత్రం టోర్నీకి అర్హత సాధించలేక ఇంటివద్దే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో భారత ఫుట్బాల్ స్థితిపై పెద్ద చర్చ జరుగుతోంది. భారత జాతీయ జట్టు కెప్టెన్ సందేష్ జింగన్ (Sandesh Jhingan) ఈ అంశంపై స్పందించారు. 2015లో అరంగేట్రం చేసినప్పుడు తమ లక్ష్యం ఆసియా కప్లో క్రమం తప్పకుండా ఆడడమేనని చెప్పారు. 2019, 2023 ఆసియా కప్లకు అర్హత సాధించి, ఖతార్, చైనా, థాయ్లాండ్ వంటి జట్లపై మంచి ఫలితాలు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు.
అయితే వరల్డ్ కప్ అర్హత అంశాన్ని ప్రతి నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే చర్చించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫుట్బాల్ అభివృద్ధి కోసం నిరంతర సమీక్ష అవసరమని, ప్రతి మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి ప్రగతిని అంచనా వేయాలని అభిప్రాయపడ్డారు. దేశంలో అన్ని వయస్సుల క్రీడాకారుల కోసం స్థిరమైన, వ్యవస్థీకృత దేశీయ లీగ్ అవసరమని జింగన్ స్పష్టం చేశారు. ఐదేళ్ల పటిష్ట ప్రణాళిక ఉంటేనే జాతీయ జట్టును బలంగా తయారు చేయగలమని అన్నారు.
ఇదే విషయంపై భారత గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు కూడా మద్దతు తెలిపారు. వరల్డ్ కప్ కలను సాధించాలంటే ఆసియా కప్లో క్రమంగా నాకౌట్ దశకు చేరుకోవడం వంటి దశలవారీ పురోగతి అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈసారి వరల్డ్ కప్లో కేప్ వర్డే వంటి చిన్న దేశాలు అర్హత సాధించడం ఫుట్బాల్లో అవకాశాల సమానత్వానికి నిదర్శనమని జింగన్ అన్నారు. మైదానంలో ఎవరు బాగా ఆడితే వారికే విజయం దక్కుతుందని వ్యాఖ్యానించారు.

