కలం, వెబ్ డెస్క్: గ్రామీణ ప్రాంతాలను డిజిటల్ సాంకేతికతతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘సమృద్ధి గ్రామ్ ఫిజిటల్ సర్వీసెస్’ (Samriddh Gram Phygital) పైలట్ ప్రాజెక్ట్కు దేశంలో మూడు గ్రామాలను ఎంపిక చేశారు. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉన్న నారాకోడూరు (Narakoduru) గ్రామం ఎంపికైంది. ఈ ప్రాజెక్ట్ను ఈ నెల 22న కేంద్ర మంత్రి సింథియా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్ట్ను కార్పస్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అమలు చేస్తోంది. భారత్నెట్ ద్వారా గ్రామంలో డిజిటల్ కనెక్టివిటీని పెంపొందిస్తూ, భౌతిక మౌలిక వసతులను డిజిటల్ సేవలతో అనుసంధానించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విప్లవానికి నారాకోడూరు (Narakoduru) ఆదర్శంగా నిలవాలని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, దేశవ్యాప్తంగా మరిన్ని గ్రామాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయి.
ప్రాజెక్టులో అందించే సేవలు
సమృద్ధి కేంద్రం:
గ్రామంలో డిజిటల్, భౌతిక సేవల సమగ్ర కేంద్రంగా ‘సమృద్ధి కేంద్రం’ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రజలకు పబ్లిక్ వైఫై హాట్స్పాట్లు, భారత్నెట్ ఎఫ్టీటీహెచ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
ఆరోగ్య సేవలు:
టెలీమెడిసిన్, హెల్త్ ఏటీఎంలు, అత్యవసర వైద్య సేవలు అందిస్తారు. గ్రామస్థులు నిపుణులైన వైద్యులను ఆన్లైన్ ద్వారా సంప్రదించవచ్చు.
వ్యవసాయం:
ఐఓటీ ఆధారిత మట్టి పరీక్షలు, డ్రోన్ సాంకేతికత, స్మార్ట్ ఇరిగేషన్ వ్యవస్థల ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ సాయం అందుతుంది.
విద్య, నైపుణ్యాభివృద్ధి:
స్మార్ట్ తరగతి గదులు, ఆడియో, వీడియో ఆధారిత బోధన, డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ గవర్నెన్స్, ఆర్థిక సేవలు:
ప్రభుత్వ పథకాల దరఖాస్తులు, పత్రాల సేవలు, డిజిటల్ చెల్లింపులు వంటి సేవలకు సహాయం అందుతుంది.
ఈ కామర్స్:
స్థానిక వ్యాపారులకు అవకాశాలు కల్పించేందుకు ఎన్డీసీతో అనుసంధానం చేస్తారు.
Read Also: నేడు ఏపీకి బిల్ గేట్స్.. చంద్రబాబు, పవన్తో కీలక భేటీ
Follow Us On : WhatsApp


