కలం, వెబ్ డెస్క్: నల్లమల అడవుల్లో ప్రకృతి ఒడిలో వెలసిన సలేశ్వరం (Saleshwaram) లింగమయ్య జాతర నేటి నుంచి వైభవంగా ప్రారంభమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు ఈ జాతర సాగనుంది. లోతైన లోయలు, జలపాతాల మధ్య కొలువుదీరిన శివుడిని దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. ఏటా చైత్ర పౌర్ణమి తరుణంలో జరిగే ఈ అపురూప ఘట్టం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు నల్లమల అటవీ ప్రాంతానికి చేరుకుంటున్నారు. కఠినమైన కొండ మార్గాల గుండా ప్రయాణిస్తూ ప్రకృతి అందాల నడుమ లింగమయ్యను దర్శించుకోవడం ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అటవీ ప్రాంతంలో నిబంధనలకు లోబడి ఈ జాతర సంబరాలు కొనసాగుతున్నాయి.
దక్షిణ కాశీగా..
నల్లమల (Nallamala) అడవుల్లో ప్రాచుర్యం పొందిన సలేశ్వరం జాతరను (Saleshwaram Jathara) ‘దక్షిణ కాశీ’గా పేరుంది. దట్టమైన అరణ్యం, ఎత్తైన కొండలు, లోతైన లోయల మధ్య ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుహలో లింగమయ్య కొలువై ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఏడాది పొడవునా ఈ ప్రాంతం అటవీ శాఖ ఆధీనంలో ఉండి భక్తులకు ప్రవేశం నిషిద్ధంగా ఉంటుంది. కేవలం చైత్ర పౌర్ణమి సమయంలో మాత్రమే భక్తులకు అనుమతి లభిస్తుంది. సుమారు 200 అడుగుల ఎత్తు నుండి పడే జలపాతం, దాని కిందనే ఉండే శివలింగం భక్తులకు కనువిందు చేస్తాయి. ఈ జలపాతంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
సాహసం.. సౌందర్యం
ఈ యాత్ర ఆధ్యాత్మికతతోపాటు సాహసంతో కూడి ఉంటుంది. భక్తులు రాంపూర్ పెంట నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర కొండ మార్గాల్లో, ఇరుకైన లోయల గుండా నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ప్రాణాలకు తెగించి చేసే ఈ ప్రయాణం భక్తుల్లో మరిచిపోలేని భక్తి భావాన్నిస్తుంది. ఇక్కడ ఎలాంటి వసతులు లేకపోయినా, ప్రకృతి ఒడిలో ఆ పరమశివుడిని దర్శించుకోవడం కోసం భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా చెంచు గిరిజనుల ఆచార వ్యవహారాలు, వారు నిర్వహించే పూజలు ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పర్యావరణ హితంగా సాగే ఈ జాతర నల్లమల అడవుల అపురూప సౌందర్యాన్ని చాటిచెబుతుంది.
Read Also: ఆది కుంభేశ్వర ఆలయం: ఈ ఒక్క పని చేస్తే శత్రుజయం తథ్యం!
Follow Us On: Instagram

