కలం, వెబ్ డెస్క్: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రాజెక్టుపై ఉమ్మడి రాయలసీమ జిల్లాల పార్టీ అధ్యక్షులు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్త మాజీ మంత్రి శైలజానాధ్ లతో సజ్జల జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాయలసీమ ప్రాంతానికి జీవనాడిగా భావిస్తున్న ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు. ప్రాజెక్టు సాధన కోసం రౌండ్ టేబుల్ సమావేశాలు, నిరసన కార్యక్రమాలను వైసీపీ ముమ్మరం చేసిందని తెలిపారు. గ్రామస్థాయి నుంచే ప్రజల్లో అవగాహన కల్పించేలా పార్టీ కార్యాచరణ రూపొందించిందని వివరించారు.
పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు లొంగిపోయి రాయలసీమ హక్కులను తాకట్టుపెడుతున్నారని సజ్జల (Sajjala) తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఈ అంశంపై ఇప్పటికే నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాలకు మంచి స్పందన వచ్చిందని.. ప్రాజెక్ట్ అవసరాన్ని ప్రజలకు విస్తృతంగా వివరించే ప్రయత్నం కొనసాగుతోందని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్పై జిల్లా స్థాయి సమావేశాలు విజయవంతంగా పూర్తయ్యాయని ప్రకటించారు. వాటికి విస్తృత ప్రచారం కూడా లభించిందన్నారు.
గతంలో ప్రతిపాదించిన విధంగా రాష్ట్ర స్థాయిలో టాస్క్ఫోర్స్ తో పాటు ప్రతి జిల్లాలో కూడా ప్రత్యేక టాస్క్ఫోర్స్లు ఏర్పాటు చేసుకుని నీటి పారుదలపై అవగాహన ఉన్నవారు, సమన్వయం చేయగల సీనియర్ నాయకులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఈ ఏడాది చివరి వరకూ రాయలసీమ లిఫ్ట్ అంశంపై నిరంతర కార్యాచరణ కొనసాగాలని చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రణాళికాబద్ధంగా పనిచేసే వ్యక్తులను నియమించి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. రాష్ట్ర స్థాయి టాస్క్ఫోర్స్ పూర్తికాగానే జిల్లా స్థాయిలో కూడా టాస్క్ఫోర్స్లు ఏర్పాటు చేయాలన్నారు.
జూమ్ మీటింగ్ లో మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో నిర్వహించిన సమావేశాలకు మంచి స్పందన వచ్చిందని చెప్పారు. గ్రామస్థాయిలోకి వెళ్లేందుకు అవసరమైన ప్రచార సామగ్రిని సిద్ధం చేశామని తెలిపారు. వచ్చే నెల 15లోగా నియోజకవర్గ స్థాయిలో వర్కింగ్ గ్రూప్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా రాయలసీమ లిఫ్ట్ అంశంపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా కార్యాచరణ రూపొందించుకుందామని అన్నారు.
Read Also: సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. ప్రభుత్వ సేవల అమలుపై దిశానిర్దేశం
Follow Us On: WhatsApp

