బండి భగీరథ్ వ్యవహారం.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్

కలం, తెలంగాణ బ్యూరో : బండి భగీరథ్ (Bandi Bhagirath) పోక్సో కేసు వ్యవహారం బీజేపీలో మంటలు రేపింది. రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ పడరాని పాట్లు పడుతున్నది. రెండు పార్టీల నేతల మధ్య బండి భగీరథ్ హాట్ టాపిక్‌గా మారారు. కొడుకు చేసిన తప్పుకు తండ్రిపై చర్యలు తీసుకోవాలని బీజేపీని బీఆర్ఎస్ (BJP vs BRS) డిమాండ్ చేస్తున్నది. తండ్రి కేంద్ర మంత్రిగా ఉన్నందున అధికార దుర్వినియోగం జరుగుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. బండి సంజయ్ తప్పు చేయనప్పుడు ఆయనపై పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ వాదిస్తున్నది. తప్పు చేసిన కొడుకుపై ఇప్పటికే చర్యలు మొదలయ్యాయని అంటున్నది. బండి సంజయ్ (Bandi Sanjay) రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ నిరనసలు, ర్యాలీలు చేస్తుండడంతో బీజేపీ సైతం కౌంటర్ స్ట్రాటెజీకి ప్లాన్ చేసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలోని తప్పులను ఏకరువు పెడుతున్నది. రెండు పార్టీల మధ్య మొదలైన రాజకీయ పోరు రానున్న రోజుల్లో మరింత వేడెక్కనున్నది.

కేంద్ర మంత్రిగా కొనసాగడం దేశానికే అవమానం : కేటీఆర్

“ఒక సిట్టింగ్ కేంద్ర మంత్రి కుమారుడిపై లుకౌట్ నోటీసులు జారీ కావడం దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్ కావచ్చు.. కేంద్ర హోం మంత్రి కొడుకు పోక్సో కేసులో నిందితుడు కావడం కూడా తొలిసారి కావచ్చు.. పోలీసులకు దొరకకుండా పరారీలో ఉండటమూ ఇదే మొదటిసారి కావచ్చు… కేంద్ర హోం శాఖ మంత్రి కొడుకు పోక్సో కేసులో జైలుకు వెళ్లిన పరిస్థితిని ఎప్పుడైనా చూశామా?.. తండ్రిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయకుంటే విచారణ సజావుగా జరుగుతుందా?.. నిష్పాక్షికమైన విచారణ జరగాలంటే కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్ తప్పుకోవాలి.. తప్పు చేసిన వ్యక్తిని ఎనిమిది రోజులు దాచిపెట్టింది ఆ కేంద్ర మంత్రే కదా.. ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతుండడం తెలంగాణకు, దేశానికి అవమానం.. బాధితురాలి తల్లిదండ్రులపై బండి సంజయ్ స్వయంగా బెదిరింపులకు దిగుతూ, ఒత్తిడి తీసుకువస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి..” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

బద్నాం చేయడానికే పార్టీకి అంటగడుతున్నారు : బీజేపీ స్టేట్ చీఫ్

“బండి సంజయ్ కేంద్ర మంత్రి.. ఆయన బీజేపీ లీడర్.. ఆయన ఏ తప్పూ చేయలేదు.. పార్టీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు.. బీజేపీని బద్నాం చేయడమే పనిగా పెట్టుకుంది బీఆర్ఎస్.. నిందితుడు బెయిల్ కోసం ప్రయత్నించడం తప్పు ఎలా అవుతుంది?.. బెయిల్ రాకపోవడంతో ఆయనే వెళ్ళి పోలీసులకు సరెండర్ అయ్యాడు.. కాళేశ్వరం కేసులో విచారణ కమిషన్ నివేదిక ఇస్తే బీఆర్ఎస్ లీడర్లు కోర్టుకు వెళ్ళలేదా?.. బండి భగీరథ్ తప్పు చేస్తే బండి సంజయ్‌కు ఎందుకు అంటకడుతున్నారు?.. ఢిల్లీ లిక్కర్ కేసులో చెల్లెలిపైన ఆరోపణలు వచ్చి ఆమె జైలుకు వెళ్తే అన్నగా కేటీఆర్ (KTR) రిజైన్ చేశారా?.. బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా రిజైన్ చేశారా?.. గ్రాఫ్ పడిపోతున్న బీఆర్ఎస్ ఇప్పుడు పనిగట్టుకుని బీజేపీపై (BJP vs BRS) బురదజల్లుతున్నది…” అని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు (Ramchander Rao) కౌంటర్ ఇచ్చారు.

Read Also: తెలంగాణ పోలీస్ అధికారులకు అమిత్ షా సన్మానం

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>