కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) లో ఆర్టీసీ సమ్మె (RTC Strike) షురూ అయ్యింది. బస్టాండ్ ముందు ఉన్న మొదటి డిపో వద్ద కార్మికులు భారీగా చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ‘కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ఉదయం మొదటి బస్సు నుంచే డిపోల నుంచి వాహనాలు బయటకు రానివ్వబోమని స్పష్టం చేశారు. చర్చలు విఫలమయ్యాయని, ఇక వెనక్కి తగ్గేది లేదని కార్మిక నాయకులు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి నాలుగు వారాల గడువు ఎందుకు అవసరమని ప్రశ్నించారు. అలాగే 21వ, 25వ పీఆర్సీల అమలు ఆలస్యం కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మహాలక్ష్మి పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఆరు ఆర్టీసీ డిపోలు ఉండగా, వాటిలో ఒకటి ప్రైవేట్కు కేటాయించబడింది. మిగిలిన ఐదు డిపోల పరిధిలో సుమారు 600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఉదయం నుంచే సమ్మె (RTC Strike) ప్రభావం పెరుగుతుండటంతో జిల్లా వ్యాప్తంగా బస్సు సర్వీసులు మరింతగా దెబ్బతినే అవకాశం ఉంది.
Read Also: క్రాస్ రోడ్స్ లో కాళేశ్వరం.. BRS లో టెన్షన్..
Follow Us On: WhatsApp

