కలం, నల్లగొండ బ్యూరో : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి కొండపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళా భక్తురాలు తీవ్రంగా గాయపడ్డారు. ఆమె కాలుపై నుంచి బస్సు వెళ్లడంతో పాదం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. హైదరాబాద్లోని నార్సింగి ప్రాంతానికి చెందిన అనిత అనే భక్తురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం కోసం యాదగిరిగుట్టకు వచ్చారు. మొక్కులు చెల్లించుకుని, దర్శనం ముగించుకున్న అనంతరం తిరిగి వెళ్లేందుకు కొండపై ఆర్టీసీ (RTC) బస్సు ఎక్కుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
బాధితురాలు బస్సు ఎక్కుతున్న క్రమంలో డ్రైవర్ వెనుక ఏం జరుగుతుందో గమనించకుండా ఒక్కసారిగా బస్సును ముందుకు కదిలించారు. దీంతో అనిత పట్టుతప్పి కింద పడిపోగా, బస్సు టైరు ఆమె కాలు మీది నుంచి వెళ్లింది. ఈ భయానక ఘటనతో అక్కడున్న భక్తులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అనిత కాలు తీవ్రంగా గాయపడి రక్తస్రావం కావడంతో ఆమె స్పృహతప్పి పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి బాధితురాలిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొండ (Yadagiri Gutta)పై తిరిగే బస్సు డ్రైవర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, కానీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని బాధితురాలి కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చే ఈ పుణ్యక్షేత్రంలో భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరుతున్నారు.
Read Also: రెండు వారాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం.. కీలక ఆదేశాలు
Follow Us On: Instagram

