కలం, కరీంనగర్ బ్యూరో : ఆర్టీసీ సమ్మె (RTC Strike) నేపథ్యంలో కరీంనగర్ (Karimnagar) లో ఆర్టీసీ బస్సు ప్రమాదం(RTC Bus Accident) కలకలం రేపింది. బుధవారం ఉదయం కోతిరాంపూర్ బైపాస్ రోడ్డుపై కరీంనగర్–2 డిపోకు చెందిన బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి, అనంతరం అదుపుతప్పి రోడ్డు మధ్య డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో ఉన్న ప్రయాణికులు గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి వారిని బయటకు తీసి సమీప ఆసుపత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి స్వల్పంగా ఉన్నట్లు సమాచారం.
ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ డ్రైవర్లతో వాహనాలు నడిపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అనుభవం లేకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను నియంత్రించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రయాణికుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతుండగా, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

