కలం, కరీంనగర్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ (Vemulawada) పట్టణ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని టాటా ఏస్ వాహనం బలంగా ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు కరీంనగర్ సమీపంలోని రేకుర్తి గ్రామానికి చెందిన దానే రమేష్ (30)గా గుర్తించారు. తాపీ మేస్త్రీగా పనిచేస్తూ వేములవాడలో నివాసం ఉంటున్న రమేశ్ సోమవారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. జయవరం గ్రామ సమీపంలో ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం అతడిని బలంగా ఢీకొట్టడంతో.. తీవ్రంగా గాయపడిన రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

