అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థికి ఉన్న వయోపరిమితిపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లూ 25 ఏళ్లుగా ఉన్న వయోపరిమితిని 21 సంవత్సరాలకు తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని అన్నారు. రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) సద్భావనా యాత్ర సంస్కరణ దినోత్సవ కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్కి ఈ సందర్భంగా సద్భావనా అవార్డును బహూకరించి సత్కరించారు.
‘‘దేశ పరిపాలనా యంత్రాంగంలో 21 ఏళ్లకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వయసును 21 ఏళ్లకు ఎందుకు తగ్గించకూడదు. ప్రభుత్వాలను నిర్ణయించే అధికారం యువతకు ఉండాలన్న సంకల్పంతో రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. అదే క్రమంలో ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పారు.
దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడటానికి రాజీవ్ గాంధీ గారి త్యాగాలను గుర్తు చేస్తూ, గడిచిన 35 ఏళ్లుగా క్రమం తప్పకుండా సద్భావనా యాత్ర సంస్మరణ కార్యక్రమాన్ని జరుపుతున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు సీఎం రేవంత్(Revanth Reddy).
Read Also: రెండేళ్లలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది: కేటీఆర్

