కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో వచ్చే జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవ్వనున్న విషయం తెలిసిందే. అయితే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కిట్ లు పంపిణీ చేయబోతున్నది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులకు వివిధ వస్తువులతో కూడిన కిట్లను పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (Revanth) తెలిపారు. అలాగే విద్యార్థులతో యాంటీ డ్రగ్స్ ప్రతిజ్ఞ కూడా చేయించబోతున్నారు. కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి లోక్భవన్లోని గవర్నర్ నివాసానికి వెళ్లి ఆయనను ఆహ్వానించారు.
విద్యార్థులతో ప్రతిజ్ఞ
విద్యార్థులతో పొగాకు, మద్యం, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు వివరించారు. విద్యార్థులకు అందజేసే కిట్లలో యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ బ్యాగులు, క్రీడా దుస్తులు తదితర అవసరమైన సామగ్రి ఉంటాయని సీఎం వివరించారు.
యాజమాన్యాలకు సూచనలు
పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు డ్రగ్స్, ఇతర వ్యసనాల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకునేలా యాజమాన్యాలకు సూచనలు జారీ చేస్తామని చెప్పారు. పాఠశాల విద్యాశాఖ, పోలీసు శాఖ, ఈగల్ సంయుక్త ఆధ్వర్యంలో సామూహిక ప్రతిజ్ఞతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యాసంస్థలను సురక్షితంగా, డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యాజమాన్యాల సమష్టి బాధ్యతపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని సీఎం గవర్నర్కు వివరించారు.

