కలం, ఖమ్మం బ్యూరో : ఏపీలో విలీనం చేసిన ఐదు గ్రామాలను భద్రాచలంలో తిరిగి కలిపేంత వరకూ, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పోరాటం చేస్తూనే ఉంటానని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి (Renuka Chowdhury) తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలనే డిమాండ్ తో సోమవారం భద్రాచలంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేణుక చౌదరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, రాజ్యసభలో ఈ అంశం లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. అలాగే ఇద్దరు ముఖ్యమంత్రుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నం చేస్తానని తెలియజేశారు. బీజేపీకి రాముల వారి మీద ప్రేమ ఉంటే వెంటనే చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని ఆమె (Renuka Chowdhury) డిమాండ్ చేశారు. అలాగే 12 ఏళ్ల నుంచి ఈ విలీన సమస్య కోసం తాను పోరాటం చేస్తున్నానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పొదేం వీరయ్య, బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పరిసర గ్రామాలైన పురుషోత్తం పట్నం, కన్నైగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, ఎటపాక ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు మధ్య దూరం ఒక గల్లీ తేడాతో ఉంటుంది. అశాస్త్రీయంగా ఆర్డినెన్సు ద్వార ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడం వలన ఈ పరిస్థితి నెలకొందనీ, ఈ ఐదు గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
ఈ ఐదు గ్రామాల ప్రజలకు తెలంగాణలోని భద్రాచలం కూత వేటు దూరంలో ఉంటుంది. కానీ టెక్నికల్ గా పోలవరం జిల్లాలో ఉన్న వీళ్ళకు రంపచోడవరం కానీ చింతిర్యాల కానీ వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి ప్రజలు విద్యా, వైద్యం, ఇతర అన్ని అవసరాలకోసం భద్రాచలానికి వస్తుంటారు. ఎందుకంటే చాలా దగ్గరగా ఉండటం వలన. కానీ కలెక్టర్ ఆఫీస్, కోర్టు వంటి ప్రభుత్వ పనుల కోసం వెళ్ళాలంటే వందల కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే.

