కలం, ఖమ్మం బ్యూరో : పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala Nageswara Rao) తెలిపారు. సోమవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో 500 మంది మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేయడంతో పాటు, టీఎన్జీవో ఫంక్షన్ హాల్లో అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, మహిళల సాధికారత కుటుంబ సంక్షేమానికి అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. పేదరికం నుండి బయటకు రావాలంటే మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆదాయం సంపాదించాల్సిన అవసరం ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్ల నుంచి రూ. 23 వేల కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని ఆయన (Minister Tummala Nageswara Rao) వెల్లడించారు.
మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై ప్రభుత్వం 10 వేల కోట్ల వ్యయం చేస్తోందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఖమ్మం నగరంలో ఇప్పటికే 2,500 ఇళ్లు మంజూరు చేయగా, వచ్చే ఏడాది మరో 3,500 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారని తెలిపారు. రైతులు, యువత, కూలీలు ప్రతి వర్గం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో 3 వేల మంది విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించగా, ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.1.5 లక్షలు వెచ్చిస్తోందని చెప్పారు. పిల్లలు విద్యను అభ్యసిస్తేనే పేదరికం నుండి బయటపడగలమని, నాణ్యమైన విద్య పొందిన పిల్లలు భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు సాధించి కుటుంబానికి గౌరవం, ఆనందం తీసుకొస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు పంపిణీ..
అనంతరం అంగన్వాడీ టీచర్లకు మంత్రి సెల్ ఫోన్లు పంపిణీ చేసి మాట్లాడుతూ, తాను గతంలో అంగన్వాడీ శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో రెండు సార్లు వేతనాలను పెంచినట్లు గుర్తుచేశారు. అంగన్వాడీ టీచర్లు పేద ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం పొందారని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నచిన్న అసౌకర్యాల పేరుతో ర్యాలీలు చేయకుండా నిబద్ధతతో పనిచేయాలని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లకు అందజేసిన సెల్ఫోన్లు ప్రజలకు సేవలందించేందుకు సమర్థంగా ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. సెల్ఫోన్ల ద్వారా అంగన్వాడీ సేవలపై పూర్తి స్థాయి పర్యవేక్షణ సాధ్యమతుందని చెప్పారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు కొత్త భవనాలు మంజూరు చేసినట్లు, వాటిని అన్ని సౌకర్యాలతో త్వరగా పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అనంతరం టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ వద్ద ఖమ్మం నగరపాలక సంస్థ చే కొనుగోలు చేసిన 3 రహదారి ఊడ్చే యంత్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ముజాహిద్, జిల్లా సంక్షేమ అధికారిణి వేల్పుల విజేత, ఖమ్మం నగర పాలక సంస్థ సహాయ కమీషనర్ అనిల్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

