కలం, నిర్మల్: మహిళల సాధికారత, గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే (Nirmal MLA) ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) అన్నారు. లక్ష్మణచందా మండలం రాచాపూర్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన మహిళా సమైక్య సంఘ భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలను బలోపేతం చేయడం, వారికి సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాల ద్వారా నిధులు కేటాయిస్తోందని, వాటిని పారదర్శకంగా వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముత్యం, బీజేపీ మండల అధ్యక్షులు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

