కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026లో ఫైనల్ బెర్త్ కోసం కీలక పోరు సిద్ధమైంది. క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు (RCB vs GT) మంగళవారం ధర్మశాలలో తలపడనున్నాయి. అయితే ఈ భారీ మ్యాచ్కు వర్షం ముప్పు కనిపిస్తోంది. పాయింట్ల పట్టికలో రెండు జట్లు కూడా 18 పాయింట్లతో సమంగా నిలిచాయి. కానీ మెరుగైన నెట్ రన్రేట్ కారణంగా ఆర్సీబీ టాప్ ప్లేస్ దక్కించుకుంది. అదే ఇప్పుడు జట్టుకు అదనపు లాభంగా మారే అవకాశం ఉంది.
ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. మ్యాచ్కు ముందు వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. మేఘావృత పరిస్థితులతో పాటు భారీ వర్ష సూచనలు కూడా ఉన్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఆర్సీబీ నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఎందుకంటే లీగ్ దశలో ఆ జట్టు గుజరాత్ కంటే పైస్థానంలో నిలిచింది. క్వాలిఫయర్-1కు రిజర్వ్ డే లేకపోవడంతో పాయింట్ల పట్టిక ఆధారంగానే నిర్ణయం తీసుకుంటారు.
అయితే వర్షం మధ్యలో ఆటకు అవకాశం ఉంటే నిర్వాహకులు నేరుగా సూపర్ ఓవర్ నిర్వహించే అవకాశమూ ఉంది. పూర్తి మ్యాచ్ సాధ్యం కాకపోతే ఈ విధానంతో విజేతను నిర్ణయించవచ్చు. ఈ సీజన్లో ఆర్సీబీ, గుజరాత్ మధ్య పోటీ సమంగా సాగింది. రెండు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచాయి. మొత్తం ఐపీఎల్ చరిత్రలో కూడా ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డు 4-4తో సమంగా ఉంది. లీగ్ దశలో ఆర్సీబీకి వచ్చిన ఐదు ఓటముల్లో ఒకటి గుజరాత్ చేతిలోనే వచ్చింది. ఆ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లు బెంగళూరును బాగా ఇబ్బంది పెట్టారు. కానీ తర్వాతి మ్యాచ్లో ఆర్సీబీ తిరిగి గెలిచి ప్రతీకారం తీర్చుకుంది.
ఇప్పుడు రెండు జట్ల లక్ష్యం కూడా రెండో ఐపీఎల్ టైటిల్పైనే ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ వరుసగా రెండో ట్రోఫీ కోసం పోరాడుతోంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ 2022 తర్వాత మళ్లీ కప్ గెలవాలని చూస్తోంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఓడిన జట్టుకు మాత్రం క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది.

