కలం, జనగామ జిల్లా : “రైతు గోస – బీజేపీ భరోసా” బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, దన్ పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ చిన్మయి అంజిరెడ్డి ఇతర నేతలు జనగామ (Jangaon) వ్యవసాయ మార్కెట్కి చేరుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిందని ఆరోపించారు.
ఈ సందర్భంగా 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు. బస్తా కి నాలుగు కిలోలు కట్ చేస్తున్నారు, కట్ అవుతున్న ధాన్యం ఎవరి జేబులోకి వెళుతున్నాయన్న ఆయన.. దీనికి ముఖ్య మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మక్కలు కొనుగోలు చేయడం లేదన్నారు. అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతులను విస్మరిస్తోందని మండిపడ్డారు.
రైతులకు అండగా బీజేపీ పార్టీ ఉంటుంది
రైతుకు న్యాయం జరిగే వరకు రైతులకు అండగా బీజేపీ పార్టీ ఉంటుందని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అన్నారు. రోహిణి ఎండలకు రైతులు చనిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని ఫైర్ అయ్యారు. వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. ఇప్పటికైనా వడ్లు కొనకపోతే మీ కండ్లల్లో కారం కొడతామని ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. మంత్రులకు కమిషన్ల మీద ఉన్న ఫోకస్ రైతుల మీద లేదన్న ఆయన.. వారం రోజులలో రైతు చివరి వడ్ల గింజ కొనకపోతే ప్రజా భవన్ ముందు పోస్తామని హెచ్చరించారు.

