కలం, వెబ్ డెస్క్: దేశంలో ఆన్ లైన్ మోసాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల భద్రతను పటిష్టం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రతిపాదనలు చేసింది. ముఖ్యంగా భారీ మొత్తంలో జరిగే లావాదేవీలను ఒక గంట పాటు ఆలస్యం చేయడంతో పాటు, మరికొన్ని భద్రతా చర్యలను అమలు చేయాలని భావిస్తోంది. రూ.10,000 కంటే ఎక్కువ విలువైన అకౌంట్ టు అకౌంట్ బదిలీలకు, ముఖ్యంగా యూపీఐ (UPI) ద్వారా చేసే చెల్లింపులకు ఒక గంట విండో పీరియడ్ను ప్రవేశపెట్టాలని ఆర్బీఐ సూచించింది. ఈ విధానంలో డబ్బు పంపిన వ్యక్తి ఖాతా నుంచి కట్ అవుతుంది కానీ అవతలి వ్యక్తికి చేరదు. ఈ గంట సమయం ఒక సేఫ్టీ విండోలా పని చేస్తుంది. ఒకవేళ పొరపాటున లేదా మోసగాళ్ల మాటలు నమ్మి డబ్బు పంపి ఉంటే, ఆ గంటలోపు వినియోగదారులు ఆ లావాదేవీలను రద్దు చేసుకోవచ్చు.
సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక రక్షణ
వృద్ధులు, దివ్యాంగులను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఆర్బీఐ అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. 70 ఏళ్లు పైబడిన వారు లేదా దివ్యాంగులు రూ.50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని బదిలీ చేయాలనుకుంటే ఒక నమ్మకస్తుడైన వ్యక్తి ద్వారా ధృవీకరణ పొందాల్సి ఉంటుంది. అయితే, అవసరమైతే రిస్క్ వివరాలు తెలుసుకున్న తర్వాత ఈ ఆప్షన్ను వద్దనుకునే అవకాశం కూడా ఉంటుంది.
లావాదేవీలను నిలిపివేసేందుకు కిల్ స్విచ్ బటన్
వీటితో పాటు ఏదైనా మోసం జరుగుతుందని అనుమానం వస్తే వినియోగదారులు తమ డిజిటల్ లావాదేవీలను తక్షణమే నిలిపివేసేలా కిల్ స్విచ్ బటన్ను బ్యాంకులు అందుబాటులోకి తీసుకురావాలి. దీన్ని మళ్లీ పునరుద్ధరించాలంటే కఠినమైన ధృవీకరణ అవసరం అవుతుంది. భారీ మొత్తంలో డిపాజిట్లు జరిగే ఖాతాలపై ఆర్బీఐ దృష్టి పెట్టనుంది. ఇలాంటి ఖాతాల్లో వార్షిక పరిమితికి మించి డబ్బు వస్తే అదనపు వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు ఆ నిధులను హోల్డ్లో ఉంచుతారు.
ఎందుకీ కొత్త ప్రతిపాదనలు…
2021 నుంచి 2025 మధ్య కాలంలో దేశంలో డిజిటల్ మోసాలు పది రెట్లు పెరిగాయి. వీటి వల్ల జరిగిన నష్టం దాదాపు 230 బిలియన్లకు చేరుకుంది. డీప్ ఫేక్ టెక్నాలజీ, ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్ ద్వారా ప్రజలు మోసపోతున్నారు. అందుకే వేగం కంటే భద్రతకే ఆర్బీఐ ప్రాధానత్య ఇస్తోంది.
మినహాయింపులూ ఉన్నాయ్…
సాధారణ అవసరాల కోసం చేసే పేమెంట్లకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది. మర్చంట్ పేమెంట్లు (దుకాణాల్లో చేసేవి) ఈఎంఐలు, సబ్ స్క్రిప్షన్లు వంటి ఆటోమెటిక్ చెల్లింపులు ఈ పరిధిలో ఉంటాయి. చెక్ ద్వారా చేసే బదిలీలు యధావిధిగా కొనసాగుతాయి. ఈ ప్రతిపాదనలపై మే 8 వరకు ప్రజల అభిప్రాయాలను ఆర్బీఐ స్వీకరించనుంది. ఆ తర్వాత తుది మార్గదర్శకాలను విడుదల చేస్తుంది.

