కలం, వెబ్ డెస్క్ : సూర్యాపేట జిల్లా కోదాడ (Kodad) బైపాస్ సమీపంలో జాతీయ రహదారి 65పై శనివారం తెల్లవారుజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తున్న ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో మెయిన్ డోర్ లాక్ అయిపోయింది. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరకు అప్రమత్తమైన సిబ్బంది ఎమర్జెన్సీ విండో ద్వారా ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం కోదాడ (Kodad) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

