కలం, వెబ్ డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం ముంబయిలో నిర్వహించిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచాలని నిర్ణయం తీసుకుంది. గత సమీక్షతో పోలిస్తే ఎలాంటి మార్పులు లేకుండానే ఈ త్రైమాసికాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని.. దీంతో అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు కట్టుదిట్టమైన ద్రవ్య పరపతిని చేపడుతున్నట్లు వివరించారు. ప్రపంచ మార్కెట్లు అనేక కుదుపులకు లోనవుతున్నాయని, సరఫరా గొలుసు వ్యవస్థల మధ్య సంబంధం బలహీనపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు ఏఐ ప్రభావం, ఎల్ నినో కారణంగా వ్యవసాయ రంగంపైనా పడే ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

