కలం, వెబ్ డెస్క్: పాకిస్తాన్పై భారత్ 61 పరుగుల ఘన విజయం తర్వాత టీమిండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ పిచ్పై 175 అంటే 250లాంటిదని, సరదాగా చూస్తే టీ20లో ‘ఫాలో ఆన్’ అమలు చేయొచ్చని పేర్కొన్నాడు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత్ 175/7 స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులతో ఇన్నింగ్స్కు బలం ఇచ్చాడు. ఛేజ్కు దిగిన పాకిస్తాన్ రెండో ఓవర్కే మూడు వికెట్లు కోల్పోయి, చివరకు 114 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో తన యూట్యూబ్ చానల్లో అశ్విన్ మాట్లాడుతూ టాస్ కీలకమైందని చెప్పాడు. సల్మాన్ అలీ అఘా బౌలింగ్ ఎంచుకోవడం మ్యాచ్కు మలుపు అయ్యిందని అభిప్రాయపడ్డాడు.
ఈ వేదికపై లక్ష్యాన్ని ఛేజ్ చేయడం కష్టమని గుర్తు చేశాడు(Ravichandran Ashwin). పవర్ప్లేలో షాహీన్ అఫ్రిదిని ముందుగానే ఉపయోగించడం వ్యూహపరమైన తప్పిదమని విశ్లేషించాడు. ఇషాన్ కిషన్ ఎడమచేతి పేసర్లపై బలంగా ఆడతాడని డేటా చెబుతుందని అన్నాడు. మ్యాచ్-అప్ వ్యూహాలను సరిగా వినియోగించలేదని వ్యాఖ్యానించాడు. ఒత్తిడిని ఎదుర్కొనే విషయంలో భారత్ మెరుగ్గా ఉందని, ఈ మ్యాచ్లో పాకిస్తాన్ నిర్ణయాలు ప్రతికూలంగా మారాయని అశ్విన్ విశ్లేషించాడు.


