కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్లో జస్ప్రీత్ బుమ్రా ఫామ్పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. వరుసగా ఐదు మ్యాచ్ల వరకు ఒక్క వికెట్ కూడా దక్కకపోవడంతో అభిమానులు, నిపుణుల నుంచి విమర్శలు వచ్చాయి. బుమ్రా బౌలింగ్లో పదును తగ్గిందనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ పై జరిగిన మ్యాచ్లో బుమ్రా ఎట్టకేలకు వికెట్ ఖాతా తెరిచాడు. ఐపీఎల్ 2026లో తన తొలి వికెట్ను సాధించి తిరిగి ఫామ్లోకి వచ్చినట్లు సంకేతాలు ఇచ్చాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అశ్విన్ (Ravichandran Ashwin) మాట్లాడుతూ.. వరుస మ్యాచ్లలో వికెట్లు రాకపోవడం, జట్టు ఓటములు పెరగడం బుమ్రా మైండ్సెట్పై ప్రభావం చూపించాయని ఆయన చెప్పారు. సీజన్ ఆరంభంలో బుమ్రా మంచి బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు రాకపోవడం అతనిపై ఒత్తిడి పెంచిందని.. ఆ ఒత్తిడి కారణంగా అతని సహజ ఆటలో కొంత మార్పు కనిపించిందని తెలిపారు.
గుజరాత్పై మ్యాచ్లో బుమ్రాకు కొత్త బంతి ఇవ్వడం టర్నింగ్ పాయింట్గా మారింది. మ్యాచ్ తొలి బంతికే సాయి సుదర్శన్ను గోల్డెన్ డక్గా ఔట్ చేసి జట్టుకు శుభారంభం ఇచ్చాడు. ఈ వికెట్తో బుమ్రా మళ్లీ తన రిథమ్ను అందుకున్నట్లు కనిపించింది. త్వరలోనే పాత బుమ్రాను మళ్ళీ చూస్తామని అశ్విన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్లో బుమ్రా ప్రదర్శనపైనే అందరి దృష్టి ఉండనుంది.

